పెద్దఅంబర్పేట : పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని పాలెం జాతీయ రహదారి వెంట ఉన్న ఆభయాంజనేయస్వామి దేవాలయంలోని నవగ్రహాలను శుక్రవారం తెల్లవారుమున గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. స్థానికులు సదరు దుండగుడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని హయత్నగర్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి దుండగులను వదిలి వేశారని ఆరోపిస్తూ స్థానికంగా ఉన్న పలు పార్టీల నాయకులు జాతీయ రహదారిపై భైఠాయించారు. పోలీసు ఉన్నతాధికారులు దుండగుడిని సాయంత్రం లోగా పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. సాయంత్రం అయినా పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో దేవాలయం నుంచి హయత్నగర్ పోలీసు స్టేషన్ వరకు ర్యాలీ తీశారు. నవగ్రహాలతో పాటు దేవాలయంపైన ఉండే శిఖరాన్ని కూడా తొలగించి పక్కనే పడేశారని స్థానికులు వివరించారు. పోలీసు ఉన్నతాధికారులు భారీ బందోబస్తు కల్పించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు.
దుండగులను శిక్షంచాలి..
దేవాలయంలో నవగ్రహాల కూల్చివేతలకు పాల్పడిన వ్యక్తులపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికంగా ఉన్న పలు పార్టీల నాయకులు ఆరోపించారు. దేవాలయంలో కూల్చివేతలకు పాల్పడిన వ్యక్తులను స్వయంగా పట్టించినా పోలీసులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. వెంటనే దుండగులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు కృష్ణారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, కళ్లెం బాల్రెడ్డి, కొత్తపల్లి జైపాల్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, యువజన సంఘాల సభ్యులు, భక్తులు ఉన్నారు.