నల్లగొండ : కర్నాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతం నుంచి తెలంగాణలోని పలు జిల్లాలకు నిషేధిత గుట్కాలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.పది లక్షల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నల్లగొండ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఏవీ రంగనాథ్ కేసు వివరాలను వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు నల్లగొండ టాస్క్ఫోర్స్ పోలీసులు నార్కట్పల్లి మండలంలోని గోపాలాయపల్లిలో యాద ఆంజనేయులు కిరాణం షాపును తనిఖీ చేయగా ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు దొరికాయి.
దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నల్లగొండకు చెందిన భానుప్రసాద్ అలియాస్ శివను కూడా పట్టుకొన్నారు. వారి వద్ద ఉన్న గుట్కా నిల్వలు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రసాద్, ఆంజనేయులు సమాచారం మేరకు నల్లగొండ మండలంలోని మర్రిగూడలోని కిరాణం దుకాణాలు, పాన్షాపుల్లో గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారించగా హైదరాబాద్లోని జీడిమెట్లలో భావర్ ఖాన్, విజయ్ గోయల్ అగర్వాల్తోపాటు మరికొంత మంది నుంచి గుట్కా కొనుగోలు చేసినట్లు, వీరు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి దిగుమతి చేస్తున్నట్లు తేలింది.
జీడిమెట్ల కేంద్రంగా సాగుతున్న దందాల్లో మొత్తం 13 మందిని అరెస్టు చేశారు. వారు ఉపయోగిస్తున్న 11 సెల్ఫోన్లు, గుట్కా రవాణాకు వాడే ఆటో, మోటార్ సైకిల్, డిజైర్ కారును సీజ్ చేశారు. 65 బస్తాల నిషేధిత గుట్కా ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు.
ఇవి కూడా చదవండి..
అనుమానంతో భార్య గొంతు నులిమి చంపిన భర్త
సింగరేణిలో ఉద్యోగం పొందడం అదృష్టం
“బీఎమ్డబ్ల్యూ సీఈ04” ఫీచర్స్.. అదుర్స్..
అనుమానాస్పద స్థితిలో ట్రాక్టర్ మెకానిక్ మృతి
ట్రాక్టర్ పై నుంచి పడి డ్రైవర్ మృతి