ముంబై: అప్పులపాలైన ఒక వ్యాపారి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కుటుంబంతో కలిసి కారులో నిప్పటించుకున్నాడు. కారుతో సహా మంటల్లో కాలి అతడు మరణించగా భార్య, కుమారుడు తప్పించుకున్నారు. అయితే వారికి తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో పరిస్థితి సీరియస్గా ఉన్నది. మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ సంఘటన జరిగింది. 58 ఏళ్ల రామరాజ్ భట్ తన భార్య, కుమారుడ్ని మంగళవారం ఒక హోటల్కు లంచ్కు తీసుకెళ్లాడు. అనంతరం లాంగ్ డ్రైవ్కు వెళ్లారు. ఆ తర్వాత కారును రోడ్డు పక్కగా ఆపాడు. డ్రైవింగ్ సీటులో ఉన్న రామరాజ్ భట్ ఉన్నట్టుండి తనపై పెట్రోల్ పోసుకున్నాడు. కారులో ఉన్న 57 ఏళ్ల భార్య సంగీత భట్, 25 ఏళ్ల కుమారుడు నందన్పై కూడా పెట్రోల్ పోశాడు. అనంతరం తాను నిప్పటించుకుని వారికి కూడా నిప్పు అంటించాడు. రామరాజ్ భట్ సజీవ దహనం కాగా, ఆ కారు మంటల్లో కాలిపోయింది.
కాగా, కారు వెనుక సీటులో కూర్చొన్న వ్యాపారి భార్య, కుమారుడు ఎలాగోలా డోర్ తెరిచి బయటపడ్డారు. అయితే వారికి కూడా తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు మంటలను అదుపుచేశారు.
మరోవైపు ఆ కాలిన కారులో ఉన్న బ్యాగ్లో సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. అప్పుల సమస్యల వల్ల తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆ వ్యాపారి అందులో రాసినట్లు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.