నీలగిరి. ఆగస్టు 9: రోజురోజుకు మానవ సంబంధాలు మంటకలుస్తున్నాయి.. ఆస్తి కోసం కన్నవారు, తోడపుట్టిన వారన్న తేడాలేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. గెట్టు తగాదా కారణంగా ఒకే రోజు ఇద్దరు అన్నదమ్ములు హతమైన ఘటన నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని అక్కలాయిగూడెంలో ఆదివారం కలకలంరేపింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన అవుల రామస్వామి (57), అతని అన్న కాశయ్యకు వ్యవసాయ భూమి గురించి కొంతకాలంగా తగాదా నడుస్తున్నది. పలుమార్లు కాశయ్య, భార్య రత్నమ్మ, కొడుకులు మహేశ్, మల్లేశ్లతో కలిసి రామస్వామిపై దాడిచేసిన ఘటనలు జరిగాయి. పక్కపక్కనే ఉన్న భూమి వద్ద గెట్ల పంచాయతీ నడుస్తుండగా ఆదివారం ఉదయం బోరు పెట్టేందుకు రామస్వామి వచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న కాశయ్య, రత్నమ్మ, మహేశ్, మల్లేశ్.. రామస్వామి వద్దకు వచ్చి గొడవకు దిగారు. ఈ ఘర్షణలో కింద పడిపోయిన రామస్వామిపై పక్కనే ఉన్న కడీతో మోదడంతో కళ్లు, ముఖం అంతా ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందాడు. అదేరోజు రాత్రి నల్లగొండ నుంచి కాశివారిగూడెం దారిలో వస్తున్న కాశయ్య (63)పై దాడి జరిగింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి కాశయ్యను దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే కాశయ్య మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. కాశయ్యను రామస్వామి కొడుకు కిరణ్ కర్రతో తలపై బలంగా మోదినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుని భార్య రత్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే రోజు గ్రామంలో రెండు హత్యలు జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.