ముంబై: ముంబైలో అత్యాచారానికి గురై, అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం మరణించింది. ఓ 34 ఏండ్ల మహిళపై గురువారం రాత్రి (తెల్లవారితే శక్రవారం) కొందరు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెపై మానవ మృగాళ్లా పడటమేగాక, ఆమె మర్మావయాల్లో ఇనుప రాడ్ జొప్పించి పైశాచిక ఆనందం పొందారు. ఢిల్లీలో 2012లో మెడికోపై జరిగిన అత్యాచార ఘటనను తలపించేలా దారుణానికి ఒడిగట్టారు. ముంబై శివార్లలోని సాకినక ఏరియాలో ఈ ఘోరం జరిగింది.
శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఓ వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఖైరానీ రోడ్డులో ఓ మహిళను ఓ వ్యక్తి కొడుతున్నాడని చెప్పాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూసేసరికి బాధితురాలు రక్తపు మడుగులో పడివుంది. దాంతో అమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఇవాళ మృతి చెందింది. మహిళ పడి ఉన్న ప్రదేశంలో రోడ్డు పక్కనే ఉన్న టెంపో వ్యాన్ను పరిశీలించగా అందులో రక్తపు మరకలు కనిపించాయి. కేసుకు సంబంధించి మోహన్ చౌహాన్ (45) అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ముందుగా అతనిపై అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు, ఇప్పుడు బాధితురాలు మరణించడంతో ఆ కేసును అత్యాచారం, హత్యగా మార్చారు.