ముంబై : మగబిడ్డ కావాలనే కోరికతో భర్త తనకు ఎనిమిది సార్లు అబార్షన్ చేయించాడని ముంబైకి చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో తనకు 1500 స్టెరాయిడ్ ఇంజక్షన్లు ఇచ్చారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి తండ్రి రిటైర్డ్ జడ్జి 2007లో తన కుమార్తెకు ఉన్నత విద్య చదివి, సమాజంలో ప్రతిష్ట కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. ఇక బాధితురాలి భర్త, అత్త న్యాయవాదులు కాగా, వదిన వైద్యురాలు కావడం గమనార్హం. పెండ్లయిన కొన్నేండ్ల తర్వాత నుంచి నిందితుడు బాధితురాలిని కొట్టడం, హింసించడం ప్రారంభించాడు.
తన కుటుంబం, ఆస్తులను కాపాడేందుకు తనకు కుమారుడు కావాలని చెబుతూ మహిళకు ఎనిమిది సార్లు అబార్షన్ చేయించాడు. 2009లో బాధితురాలు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 2011లో మళ్లీ ఆమె గర్భవతి కావడంతో డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఆపై బాధితురాలిపై వేధింపులు తీవ్రమయ్యాయి. బాధితురాలిని నిందితుడు బ్యాంకాక్కు తీసుకువెళ్లి జెనెటిక్ డయాగ్నసిస్ చేయించాడు. గర్భనిర్ధారణ పరీక్షలను దేశంలో నిషేధించడంతో విదేశాల్లో పరీక్షలు చేయించి ఆడబిడ్డ పుడుతుందని తెలుసుకుని ఎనిమిది సార్లు అబార్షన్ చేయించాడు. ఈ క్రమంలో బాధితురాలికి 1500కు పైగా హోర్మోన్, స్టెరాయిడ్ ఇంజక్షన్లను ఇప్పించాడు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.