ముంబై : దేశ వాణిజ్య రాజధానిలో ఇటీవల జరిగిన మహిళ హత్యాచార ఘటన కలకలం రేపిన క్రమంలో మహిళల భద్రతకు ముంబై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో మహిళలపై నేరాలను పరిష్కరించేందుకు ముంబై పోలీసులు నిర్భయ స్క్వాడ్ను ఏర్పాటు చేశారు.
విద్యాసంస్ధలు, వ్యాపారం, ఉపాధి నిమిత్తం బయటకు వచ్చే మహిళలు, యువతులు, బాలికలను ఫోన్ కాల్స్, మెసేజ్లు, ఈ మెయిల్స్ ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారని, మహిళల భద్రత కోసం, వారిలో భరోసా ఇస్తూ నేరగాళ్లలో వణుకుపుట్టేలా నిర్భయ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, చట్టం అంటే భయం ఉండేలా ఈ బృందాలు పనిచేస్తాయని, మహిళలపై అణిచివేత, వేధింపులను నిరోధిస్తాయని ముంబై పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
నిర్భయ బృందాల మార్గదర్శకాలను పోలీసులు విడుదల చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళల భద్రతా విభాగం ఏర్పాటు చేయాలని, నిర్భయ్ పథక్ పేరుతో ప్రతి పోలీస్ స్టేషన్లో ఐదు మొబైల్ పెట్రోలింగ్ వాహనాలను దీనికోసం కేటాయించాలని స్పష్టం చేశారు. ఏసీపీ స్ధాయి మహిళా అధికారిని నోడల్ ఆఫీసర్గా నియమించాలని, ప్రతి బృందంలో ఓ మహిళా ఏఎస్ఐ, పీఎస్ఐ స్ధాయి అధికారితో పాటు ఓ మహిళ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ , డ్రైవర్ ఉండాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నిర్భయ బృందాలకు రెండు రోజుల ప్రత్యేక శిక్షణ ఉంటుందని పేర్కొంది.