మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో సకల సదుపాయాలు
త్వరలో 200 ఆక్సిజన్ పడకలు
నారాయణపేటలో మినీ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు
విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో సకల సదుపాయాలున్నాయని, ఆక్సిజన్ కొరత లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. కలెక్టరేట్లో మీడియాతో మం త్రి మాట్లాడారు. 13కి.లీ ఆక్సిజన్ ప్లాంట్తో పైప్లైన్ ద్వా రా నేరుగా పడకలకే ఆక్సిజన్ సదుపాయం అందిస్తున్నామన్నారు. రెమ్డెసివిర్ టీకాలు అందుబాటులో ఉన్నాయన్నా రు. గతేడాదితో పోలిస్తే జనరల్ దవాఖానలో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రస్తుతం 260 ఆక్సిజన్ పడకలు, 60వెంటిలేటర్ పడకలున్నాయని.. నాలుగైదు రోజుల్లో మరో 200ఆక్సిజన్ పడకలను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో 500 ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. 2014 కు ముందు తెలంగాణలో 150 వెంటిలేటర్లు లేవని గుర్తుచేశారు. మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో ఆర్టీపీసీఆర్ ఆటోమేటిక్ మెషిన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో జనరల్ దవాఖానలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. నారాయణపేటలో అడిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆక్సిజన్ సిలిండర్లు, వైద్యుల కొరతను తీర్చినట్లు మంత్రి వెల్లడించారు. లాక్డౌన్, కరోనా కట్టడిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ 24గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొవిడ్ బాధితులకు పడకలు అందుబాటులో లేవనే ఆందోళనే వద్దని మంత్రి సూచించారు. ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలోని దవాఖానలో 276 పడకలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇక్కడ అవసరమైతే 100కొవిడ్ పడకలను ప్రభుత్వం వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు.
కొవిడ్ రోగుల ఆందోళన, భయాన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రైవేట్ దవాఖానలు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వైద్యాధికారి లేదా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే ప్రైవేట్ దవాఖానలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల ప్రభుత్వ దవాఖానల్లో టీకాల కొరత లేదన్నారు. నారాయణపేట జిల్లా దవాఖానలో 100 పడకలకు సరిపోయే మినీ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని, త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సీఎం కేసీఆర్కు పాలమూరుపై ప్రత్యేక అభిమానం ఉందని అందుకే సకల వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారని మంత్రి తెలిపారు. సమావేశంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీఆర్వో స్వర్ణలత, మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్, జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్, డీఎంహెచ్వో కృష్ణ, జెడ్పీ సీఈవో జ్యోతి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు.