ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కొవిడ్ దవాఖానలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పది మంది మరణించారు. భాండప్ ప్రాంతంలోని డ్రీమ్స్ మాల్లో సన్రైజ్ హాస్పిటల్ ఉన్నది. మాల్లోని మూడో అంతస్థులో ఉన్న ఈ కొవిడ్ సెంటర్లో గురువారం అర్ధరాత్రి దాటినతర్వాత మంటలు చెలరేగాయి. దీంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు. మరికొందరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 23 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడినవారిని సమీప హాస్పిటళ్లకు తరలించారు. చికిత్స పొందుతూ మరో ఎనిమిది మంది మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య పదికి పెరిగింది.
ప్రమాద సమయంలో దవాఖానలో 76 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వారిలో 73 మంది కరోనా బాధితులు ఉన్నారు. వారందరిని వేరే హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.