ముంబై: లైంగిక చర్య గురించి తెలుసా అని స్కూల్ విద్యార్థిని అడిగిన వ్యక్తికి కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.15,000 జరిమానా విధించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు కోర్టుకు చెప్పిన వివరాల ప్రకారం.. ముంబై తూర్పు శివారు ప్రాంతంలో నివసించే 13 ఏండ్ల విద్యార్థిని ప్రతి రోజు ప్రభుత్వ బస్సులో స్కూల్కు వెళ్లేది. 2018 జూలైలో ఒక రోజు ఆ బస్సులో ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. బస్సు వెనుక వైపు కిటికీ వద్ద కూర్చొన్న విద్యార్థిని వద్దకు బస్సు కండక్టర్ చంద్రకాంత్ సుద్ కోలి రాగా ఆమె బస్ పాస్ చూపించింది. కొంత సేపటి తర్వాత ఆ విద్యార్థిని పక్కన కూర్చొన్న అతడు నీకు లైంగిక చర్య గురించి తెలుసా అని అడిగాడు. దీంతో ఆమె అలాంటివి అడుగవద్దని బదులిచ్చింది. అనంతరం బస్సులో ముందు వైపునకు వెళ్లిన కండక్టర్ కొంత సేపటి తర్వాత మళ్లీ ఆమె వద్దకు వచ్చి అదే ప్రశ్న వేశాడు. ఏమీ మాట్లాడని ఆ విద్యార్థిని స్కూల్ స్టాప్ వద్ద బస్సు దిగిపోయింది. జరిగిన విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పింది.
అనంతరం స్కూలుకు బస్సులో వెళ్లేందుకు ఆ విద్యార్థిని నిరాకరించింది. ఏమి జరిగిందని తల్లి నిలదీయగా ఏమీ చెప్పలేదు. బాలిక స్నేహితురాలిని తల్లి ఆరా తీయగా జరిగిన విషయాన్ని ఆమె చెప్పింది. దీంతో కుమార్తెను బస్ డిపో వద్దకు తల్లి తీసుకెళ్లగా కండక్టర్ కోలిని ఆ విద్యార్థిని గుర్తించింది. బాలిక తల్లి వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా కోలిపై నెహ్రూ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 12 రోజులు రిమాండ్లో ఉన్న అతడు అనంతరం బెయిల్పై విడుదలయ్యాడు.
కాగా, ఈ కేసుపై విచారణ జరిపిన ముంబై పోక్సో ప్రత్యేక కోర్టు ఇటీవల బస్సు కండక్టర్ కోలిని దోషిగా నిర్ధారించింది. అతడికి ఏడాది జైలు శిక్ష విధించడంతోపాటు బాధితురాలికి రూ.15,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. కోలి తరుఫు న్యాయవాది అపీల్ కోరగా హైకోర్టును ఆశ్రయించేందుకు నెల రోజులు గడువు ఇచ్చింది. అప్పటి వరకు జైలు శిక్ష, జరిమానా చెల్లింపును నిలిపివేసింది.