హుజూరాబాద్ టౌన్, జూలై 1: అమ్మా బాగున్నారా..?, అన్నా బాగున్నారా..? అంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ దళితులను ఆప్యాయంగా పలుకరించారు. గురువారం ఆయన పట్టణ ప్రగతి ప్రారంభోత్సవానికి ముందు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని ఇందిరానగర్ దళిత కాలనీకి చేరుకున్నారు. ఓ ఇంటి ముందు నిలబడిన జంగ వీరస్వామితోపాటు అతడి కుటుంబ సభ్యులను మంత్రి ఆప్యాయంగా పలుకరించారు. గతంలో దళిత కాలనీలెలా ఉండేవి..?, ఇప్పుడెలా ఉన్నాయి..?, కొత్తగా సీసీ రోడ్లు, మురుగు కాలువలు, తాగునీటి పైపులైన్లు వచ్చాయా?, ఇంకా ఏమైనా కావాలా? అని అడిగారు. వెంటనే మంజూరు చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని చెప్పడంతో వీరస్వామి కుటుంబ సభ్యులు సంతోషంతో ‘జై కేసీఆర్’ అంటూ నినదించారు. గత ఎమ్మెల్యే వైఫల్యంతో దళిత వాడల సమస్యలు ప్రభుత్వం దృష్టికి రాలేదని, అందుకే ఇందిరానగర్ అభివృద్ధి జరగలేదని, ఇప్పుడు పాలకవర్గం అడిగిందే తడవుగా రూ.70 లక్షలతో సీసీ రోడ్లు వేస్తున్నట్టు చెప్పారు. వారం రోజుల్లోనే అంబేద్కర్ కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరు చేయడమే కాక శంకుస్థాపన చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆరు నెలల క్రితం తన భర్త చనిపోయారని, పింఛన్ రావడం లేదని తాడం సౌందర్య కోరగా.. వచ్చే నెల నుంచి వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మీటింగ్ హాల్ లేదని ఆర్పీలు దాసరి పద్మ తదితరులు వినతిపత్రం ఇవ్వడంతో ఎస్సారెస్పీ స్థలంలో నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. మరికొంతమంది సమస్యలను విన్న మంత్రి గంగుల వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.