మహబూబ్నగర్ : వనపర్తి జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కుమారుడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో నవమాసాలు మోసి పెంచిన తల్లే అతడిని కడతేర్చి ఇంట్లో పూడ్చిపెట్టింది. కొత్తకోట మండలం రామకృష్ణాపురంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన హరిజన్ నాగమ్మ అనే మహిళకు ఇద్దరు కుమార్తె, కుమారుడు. కుమారుడు శివ (26) మద్యానికి బానిసై తరచూ నాగమ్మను వేదించేవాడు.
వారంక్రితం తాగి వచ్చి మద్యం మత్తులో తల్లితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతడి ప్రవర్తనతో విసిగిపోయిన తల్లి తన తల్లి బుచ్చమ్మ సాయంతో మద్యం మత్తులో ఉన్న కుమారుడి గొంతు కోసి హతమార్చింది. ఇంటి ఆవరణలోనే గొయ్యి తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. విషయం బయటకు రావడంతో సర్పంచ్తోపాటు స్థానికులు ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.