న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఆక్సిజన్ అవసరాలను నాలుగు రెట్లు పెంచి చూపారనే నివేదిక నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, బీజేపీ చేసిన డిమాండ్ను ఆప్ నేతలు తోసిపుచ్చారు. ఇక థర్డ్ వేవ్ తలెత్తితే ఆక్సిజన్ కొరతతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆక్సిజన్ కోసం మన పోరాటం ముగిసిందని భావిస్తే థర్డ్ వేవ్లో ఆక్సిజన్ లేకుండా ఏ ఒక్కరూ బాధపడకూడని పరిస్ధితిని కల్పించేలా మనం కసరత్తు సాగించాలని ఢిల్లీ సీఎం పిలుపు ఇచ్చారు.
సెకండ్ వేవ్లో పెద్దసంఖ్యలో కరోనా రోగులు ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడగా, థర్డ్ వేవ్లో ఇలాంటిది జరగరాదని అన్నారు. మనలో మనం కీచులాడుకుంటే కరోనా విజయం సాధిస్తుందని, మనం కలిసికట్టుగా పోరాడితే మహమ్మారి తోకముడిచి దేశం గెలుస్తుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కాగా కరోనా సెకండ్ వేవ్ ముమ్మర దశలో ఉన్న సమయంలో ఢిల్లీ ప్రభుత్వం తన ఆక్సిజన్ అవసరాలను నాలుగింతలు అధికంగా చూపిందని సుప్రీంకోర్టు నియమించిన ఆడిట్ కమిటీ నివేదిక పేర్కొనడం కలకలం రేపింది. ఢిల్లీ తీరుతో ఆ సమయంలో అత్యధిక కేసులు వెలుగుచూసిన 12 రాష్ట్రాలు ఆక్సిజన్ సరఫరాల్లోతీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.