హైదరాబాద్ : గన్తో బెదిరించి నగదు, ఫోన్ను అపహరించిన ఘటన జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి చోటు చేసుకుంది. జీడిమెట్ల అయోధ్య నగర్లో రవి అనే వ్యక్తి గత ఎనిమిదేండ్ల నుంచి నగదు బదిలీ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 9:30 గంటల సమయంలో ఇద్దరు దుండగులు నంబర్ ప్లేట్ లేని యాక్టివాపై రవి షాపు వద్దకు వచ్చారు. ఒకరు హెల్మెట్ ధరించగా, మరొకరు ముఖానికి మాస్కు పెట్టుకున్నారు.
రవి షాపులోకి వెళ్లిన వారు గన్తో బెదిరించి అక్కడున్న రూ. 1.95 లక్షల నగదుతో పాటు అతన్ని సెల్ఫోన్ను అపహరించారు. బాధిత వ్యక్తి జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. అక్కడున్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి పాల్పడిన దుండగులు.. కొంపల్లి వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. రవి సెల్ఫోన్ను రోడ్డు పక్కన చెట్ల పొదల్లో పడేసినట్లు గుర్తించారు.