మొయినాబాద్ : ప్రేమ పేరుతో చెల్లిని ఆరు నెలల నుంచి వేధింపులకు గురి చేస్తున్నాడని కోపోద్రిక్తుడైన సోదరి అన్న యువకుడిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం మొయినాబాద్లో స్థానికంగా కలకలం రేపింది. ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతుంది. ఆ బాలిక ఇంటి పక్కనే ఉండే హసీప్ అనే యువకుడు తండ్రితో పాటు పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బాలిక ఆన్లైన్ తరగతులు వినడానికి తల్లిదండ్రులు సెల్ ఫోన్ కొనుగోలు చేసి బాలికకు ఇచ్చారు. అయితే ఆ బాలిక ఫోన్ నెంబర్ను హసీప్ సేకరించి ఆ బాలికకు ఫోన్ చేయడం, వాట్సాఫ్, ఎస్ఎంఎస్లు పెట్టడం వంటివి చేస్తూ వేధిస్తున్నాడు.
అంతే కాకుండ గత నెల 20న బాలిక ఇంట్లోకు దొంగచాటును చొరబడటంతో బాలిక కుటుంబ సభ్యులు గమనించి అతన్ని పట్టుకుని తిట్టి పంపారు. ఆ యువకుడు ఫోన్లు చేయడం అలాగే కొనసాగించడంతో బాలిక కుటుంబ సభ్యులు పక్కనే ఉన్న హసీప్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పి మళ్లీ అమ్మాయి జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. అయినా హాసీఫ్ తన వంకర బుద్దిని మార్చుకోకుండా ఫోన్లు చేయడం కొనసాగించాడు. శుక్రవారం బాలిక తండ్రి, సోదరుడు హబీబ్ తనకు ఉన్న బేకరి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో హసీప్ బాలిక ఫోన్కు రెండు మూడుసార్లు ఫోన్ చేయడంతో బాలిక ఫోన్లో మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మిస్డ్ కాల్స్ చూసిన బాలిక తండ్రి ఆమెపై కోపగించుకుని కొట్టగా, బాలిక సోదరుడు హబీబ్ కోపోద్రిక్తుడై ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని ఇంటి బయట ఉన్న హాసీఫ్పై దాడి చేశాడు. పక్కనే హసీప్ తల్లి చూస్తుండగానే హబీబ్ కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
అక్కడే ఉన్న కొందరు అతన్ని నిలువరించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకుని గాయాలతో ఉన్న హసీప్ను చికిత్స నిమిత్తం నగరంలోని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా వారి ఇండ్ల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశారు. మైనర్ బాలికను వేధించిన హసీఫ్పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు కత్తితో దాడి చేసిన మైనర్ బాలుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు.