లక్నో: అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. కౌశాంబి జిల్లా పశ్చిమ సరీరా పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన మహిళ.. స్థానికంగా ఉండే మైనర్ బాలికను ఇంటికి తీసుకెళ్లి తన భర్తతో అత్యాచారం చేయించింది. ఈ ఘటన ఈ ఏడాది జనవరి 14న జరుగగా.. శనివారం బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి 14న నిందితురాలు స్థానికంగా ఉండే 16 ఏండ్ల దళిత బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ తన భర్తతో అత్యాచారం చేయించింది. నిందితుడు తన భార్య ముందే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయం బయటచెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించి పంపించారు. దాంతో భయపడిపోయిన బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచేసింది.
అయితే, బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయం చెప్పింది. దాంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో నేరుగా కోర్టుకు వెళ్లింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నిందితులైన దంపతులిద్దరిపైనా కేసులు నమోదుచేశారు. ప్రాథమిక విచారణ అనంతరం వారిని అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. బాలికను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి పంపించారు.