కామారెడ్డి : ఓ మైనర్ మగ శిశువుకు జన్మనిచ్చి.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గాంధారి మండలం బీర్మల్ తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన ఓ బాలిక గర్భం ధరించింది. కానీ ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు. నెలలు నిండడంతో ఆ బాలిక మంగళవారం రాత్రి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఏం చేయాలో తెలియక ఆమె.. శిశువును చెట్ల పొదల్లో వదిలేసి.. తండాకు సమీపంలోని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నది.
పసిపాప ఏడుపు విన్న స్థానికులు పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఐసీడీఎస్ సిబ్బంది.. శిశువును కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.