జమున హ్యాచరీస్కు అచ్చంపేట పరిధిలో 40 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో షెడ్ల నిర్మాణాల కోసం 2018లో పంచాయతీ నుంచి ఎన్వోసీ తీసుకొన్నారు. తర్వాత 2019లో బ్యాంకు లోన్ కోసం మరోసారి ఎన్వోసీ తీసుకొన్నారు. అనుమానంతో పరిశీలిస్తే 2018తో పోల్చితే అదనంగా సీలింగ్ భూమిని కలిపినట్టు తేలింది. అదేంటని ప్రశ్నిస్తే.. ఈటల అనుచరులు భయభ్రాంతులకు గురిచేసి రెండోసారి ఎన్వోసీ పొందినట్టు అచ్చంపేట పంచాయతీ కార్యదర్శి.. విజిలెన్స్, ఏసీబీ అధికారులకు తెలిపారు. హకీంపేట పంచాయతీ పరిధిలోని 111 సర్వే నంబర్లోని ఏడెకరాల భూమిలో జమున హ్యాచరీస్ యాజమాన్యం అనుమతులు లేకుండానే ఫీడ్మిల్ నిర్మిస్తున్నది.
-వెల్దుర్తి, మాసాయిపేట తాసిల్దార్లు
హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) /వెల్దుర్తి: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబం ‘జమున హ్యాచరీస్’ పేరుతో చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. షెడ్ల నిర్మాణం కోసం తమ పట్టాభూమికి అదనంగా సీలింగ్ భూమిని జోడించి ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసిన జమున హ్యాచరీస్ యాజమాన్యం.. అదేమని ప్రశ్నించినవారిని భయభ్రాంతులకు గురిచేసి.. బలవంతంగా అనుమతులు రాయించుకుంది. అసలు ఈ తతంగమంతా ఎందుకనుకున్నారేమో.. ఎలాంటి పర్మిషన్లు లేకుండానే ఫీడ్మిల్లు నిర్మాణం చేపట్టారు. ఈటల కుటుంబంపై వచ్చిన అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలపై కొనసాగుతున్న విచారణలో తాజాగా మరికొన్ని లీలలు వెలుగు చూశాయి. సోమవారం విజిలెన్స్ ఎస్పీ మనోహర్, సీఐ సతీశ్రెడ్డి, ఏసీబీ డీఎస్పీ ఆనంద్ నేతృత్వంలోని బృందాలు మాసాయిపేట తాసిల్దార్ కార్యాలయంలో విచారణ కొనసాగించాయి. మాసాయిపేట తాసిల్దార్ మాలతి, వెల్దుర్తి తాసిల్దార్ సురేశ్కుమార్, ఆర్ఐ ధన్సింగ్తో అధికారులు సుదీర్ఘంగా మాట్లాడి, వివరాలు సేకరించారు. అనంతరం అచ్చంపేట పంచాయతీ కార్యదర్శి జానకీరాం, హకీంపేట కార్యదర్శి దేవేందర్ను పిలిపించారు. జమున హ్యాచరీస్ నిర్మాణాల కోసం తీసుకున్న అనుమతులపై వివరాలు సేకరించారు. వారి నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తున్నది. అనంతరం వారి వాంగ్మూలాన్ని రాతపూర్వకంగా తీసుకున్నారు. సోమవారం జరిగిన విచారణలో వెల్లడైన విషయాలను తాసిల్దార్లు మాలతి, సురేశ్కుమార్ మీడియాకు వివరించారు.
జమున హ్యాచరీస్కు అచ్చంపేట పరిధిలోని 55, 124, 126, 127, 128, 129 సర్వే నంబర్లలో 40 ఎకరాల భూమి ఉన్నదని, ఇందులో షెడ్ల నిర్మాణాల కోసం 2018లో పంచాయతీ నుంచి ఎన్వోసీ తీసుకొన్నారని తాసిల్దార్లు తెలిపారు. సంబంధిత పత్రాలు, నిర్మాణాల మ్యాప్ను సమర్పించినట్టు చెప్పారు. తర్వాత 2019లో బ్యాంకు లోన్ కోసం అంటూ మరోసారి ఎన్వోసీ తీసుకొన్నారని వెల్లడించారు. అనుమానం వచ్చి పరిశీలించగా 2018తో పోల్చితే అదనంగా సీలింగ్ భూమి ఉన్న సర్వే నంబర్ 130ని కలిపారని, ఈ మేరకు మ్యాప్లో కూడా మార్పులు చేశారని వివరించారు. అదేంటని ప్రశ్నిస్తే.. ఈటల అనుచరులు తమను భయభ్రాంతులకు గురిచేసి రెండోసారి ఎన్వోసీ పొందినట్టు అచ్చంపేట పంచాయతీ కార్యదర్శి.. విజిలెన్స్, ఏసీబీ అధికారులకు తెలిపారని పేర్కొన్నారు. హకీంపేట పంచాయతీ పరిధిలోని 111 సర్వే నంబర్లోని ఏడెకరాల భూమిలో జమున హ్యాచరీస్ యాజమాన్యం ఫీడ్మిల్ నిర్మిస్తున్నదని, ఇందుకు గ్రామపంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని తాసిల్దార్లు పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి ఇప్పటివరకు రెండుసార్లు నోటీసులు జారీచేసినా స్పందించలేదని తెలిపారు. చివరికి ఈటల వ్యవహారం రచ్చకెక్కిన తర్వాత.. ఈ నెల 10న పరిశ్రమ నుంచి సమాధాన పత్రాన్ని అందజేసినట్టు హకీంపేట కార్యదర్శి విచారణ అధికారులకు చెప్పారని అన్నారు. ప్రస్తుతం ప్రాథమిక సమాచారం అందిందని, పూర్తి విచారణలో మరిన్ని వివరాలు తెలుస్తాయని తాసిల్దార్లు చెప్పారు.
భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో జమున హ్యాచరీస్తోపాటు వివాదాస్పద భూములను సర్వే చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు అచ్చంపేటలోని సీలింగ్ భూములున్న 77, 78, 79, 80, 81, 115, 130 సర్వే నంబర్లు, హకీంపేట పరిధిలోని 97 సర్వే నంబర్లో ఉన్న భూములను ఈ నెలాఖరులో సర్వే చేయనున్నారు. మొత్తం 95.22 ఎకరాల్లోని సీలింగ్ పట్టాదారులైన 75 మంది రైతులకు, జమున హ్యాచరీస్ పరిశ్రమ యాజమాన్యానికి, ఆ భూములకు అనుబంధంగా ఉన్న ఇతర రైతులకు సర్వే, పీవోటీ నోటీసులు ఇచ్చినట్టు తాసిల్దార్లు పేర్కొన్నారు. ఈ నెల 25న మాసాయిపేట తాసిల్దార్ కార్యాలయంలో రైతులను విచారిస్తామని చెప్పారు. 27, 28, 29 తేదీల్లో భూ సర్వే చేపట్టనున్నట్టు వెల్లడించారు.