హైదరాబాద్ : గుర్రపు పందాలు కాసి లక్షలు పొగొట్టుకున్నాడు. ఈ మోజులో పడి ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా పోయింది. ఇక సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో మ్యాట్రిమోని వెబ్సైట్ను వేదికగా చేసుకున్నాడు. విదేశాల్లో ఉంటున్నట్లు నమ్మించి యువతులను మోసం చేస్తూ శనివారం రాచకొండ సైబర్క్రైం పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీలోని విజయవాడ పోరంకి గ్రామానికి చెందిన వంశీకృష్ణ ప్రస్తుతం ఖమ్మం బురాన్పురా గ్రామంలో ఉంటున్నాడు. సాయిప్రణవ్గా మ్యాట్రిమోని వెబ్సైట్లో ప్రొఫైల్ను రూపొందించి విదేశాల్లో ఉంటున్నట్లు నమ్మించాడు. ప్రొఫైల్ను చూసి చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఫోన్లో సాయిప్రణవ్తో మాట్లాడింది. ఇద్దరు వాట్సాప్ చాటింగ్, ఫోన్కాల్స్తో మాట్లాడుకుని పెండ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో సాయిప్రణవ్ పెండ్లి తర్వాత అమెరికాకు రావాలి కాబట్టీ అంతర్జాతీయ బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అదే విధంగా వీసా కోసం ఆధార్, పాన్ కార్డు, ఫొటోలతో పాటు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.90 వేలు వసూలు చేశాడు. ఆ తర్వాత బాధితురాలి బ్యాంకింగ్ వివరాలను తీసుకుని. దానిపై దాదాపు 8 లక్షల రుణాన్ని యువతికి తెలియకుండా తీసుకున్నాడు. అనంతరం బాధితురాలితో మాట్లాడకుండా తప్పించుకున్నాడు. రుణానికి సంబంధించిన ఈఎంఐ చెల్లించాలని యువతికి మెసేజ్ రావడంతో ఆమె బ్యాంక్లో ఆరా తీసింది. అప్పుడు ఆమెకు సాయిప్రణవ్ మోసం చేశాడని తెలిసింది. దీనిపై యువతి రాచకొండ సైబర్కైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం వంశీకృష్ణ అలియాస్ సాయిప్రణవ్ను అరెస్టు చేశారు. అతని నుంచి 3.20 లక్షల నగదు, మొబైల్ ఫోన్లు, బ్యాంక్ పాస్బుక్, చెక్కులను స్వాధీనం చేసుకున్నారు.
వంశీకృష్ణ నలుగురిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంతకుముందు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి బయటికి వచ్చాక తన పేరుతో కాకుండా కొత్త పేరుతో ప్రొఫైల్ను సృష్టించి అమ్మాయిలను మోసం చేయడం ప్రారంభించాడు. విదేశాల పెండ్లి సంబంధాల విషయంలో అన్ని రకాల ఎంక్వైరీలను చేసుకోవాలి. ఫోన్లో మాట్లాడేటప్పుడు వెబ్ క్యామ్ ద్వారా మాట్లాడాలి. ఎదుటివారి కుటుంబం గురించి ఆరా తీయాలి. వారి కుటుంబ సభ్యులను ప్రత్యక్షంగా కలుసుకోవాలి. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్కైం పోలీసులు సూచిస్తున్నారు.