మియాపూర్: వరకట్న వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నది.
వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. ఏడాది వరకూ వారి కాపురం బాగానే సాగింది. ఆ తదుపరి అదనపు కట్నం కోసం భర్త అత్తింటి వారి వేధింపులు అధికమయ్యాయి. వేధింపులను తట్టుకోలేక వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. తమ కూతురు ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
మియాపూర్ సీఐ వెంకటేశ్ వివరాల ప్రకారం….ఆదిలాబాద్కు చెందిన శ్రవణ్, తెల్లాపూర్కు చెందిన పావని(22)లు ఏడాది క్రితం ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. కాగా శ్రవణ్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తూ ఎస్ఎంఆర్ మెట్రో పోలీస్లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. గత కొద్ది కాలంగా అదనపు కట్నం తీసుకురావాలని భార్య పావనిని ఆమె భర్త శ్రవణ్ , అత్తమామలు శకుంతల హిమవంత్రెడ్డి ఆడపడుచులు వేధింపులకు గురి చేస్తున్నారు.
ఈ వేధింపులు మరింత తీవ్రం కావటంతో పావని శుక్రవారం రాత్రి 7 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. గుర్తించిన కుటుంబ సభ్యులు సమీప దవాఖానాకు తరలించగా. .అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లుధృవీకరించారు. ఈమేరకు మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్ తెలిపారు.