కులమతాలకు అతీతంగా కొవిడ్ మృతులకు అంత్యక్రియలు
ముస్లిం యూత్ వెల్ఫేర్, మహాసేవ సభ్యుల సేవకు ప్రశంసలు
తాండూరు, ఏప్రిల్ 25 : కరోనాతో మృతిచెందిన వారిని కడసారి చూడటానికి తమవారే ముందుకురాని పరిస్థితుల్లో అన్నీ తామై అంత్యక్రియలు చేపడుతున్నారు వికారాబాద్ జిల్లా తాండూరు ముస్లిం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ యువకులు. వీరికితోడుగా మహాసేవ పేరిట నూతన సంఘం ఏర్పాటుచేసి కరోనాతో చనిపోతున్న వారికి కులమతాలకు అతీతంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తాండూరు పట్టణంతోపాటు నియోజకవర్గంలో ఎవరైనా కొవిడ్ కారణంగా చనిపోతే తామున్నామంటూ అండగా నిలుస్తున్నారు. ముస్లిం వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 80 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో వీరి సేవలకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాండూరు ప్రాంతంలో కరానాతో మృతి చెందితే అంత్యక్రియల కోసం ముస్లిం యూత్ వెల్ఫేర్ ఫోన్ నంబర్ 93988 99403, 79815 46586, మహాసేవ ఫోన్ నంబర్ 77802 97384లో సంప్రదించాలని కోరుతున్నారు.