లక్నో : తాను తీసుకున్నఅప్పు కంటే అధిక మొత్తం చెల్లించినా ఇంకా డబ్బు కోసం వేధిస్తుండటంతో విషం సేవించి బలవన్మరణానికి పాల్పడిన వ్యక్తి ఉదంతం యూపీలోని ఫతేగంజ్లో వెలుగుచూసింది. స్కూల్ టీచర్గా పనిచేసే వ్యక్తి అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు తీవ్రతరం కావడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యవసాయ క్షేత్రంలో సూసైడ్ నోట్తో పాటు వీడియో రికార్డు చేశాడు. తాను తీసుకున్న డబ్బు కంటే అధిక మొత్తం చెల్లించినా ఇంకా డబ్బు కోసం వేధిస్తున్నారని బాధితుడు చంద్రపాల్ గంగ్వార్ వీడియోలో పేర్కొన్నాడు.
సంజార్పూర్లోని ప్రాధమిక పాఠశాలలో టీచర్గా పనిచేసే చంద్రపాల్ కొందరు వ్యక్తుల నుంచి డబ్బు అప్పుగా తీసుకున్నాడు. జూన్ 26న కనిపించకుండాపోయిన చంద్రపాల్ మిర్గంజ్లోని వ్యవసాయ క్షేత్రంలో విగతజీవిగా తేలాడు. చివరిసారిగా ఆయన రికార్డు చేసిన వీడియోలో తన మరణానికి గుడియ, పప్పు, సంతోష్ అనే ముగ్గురు వ్యక్తులు కారణమని ఆరోపించాడు.వీరు అధికమొత్తం డిమాండ్ చేస్తూ తన భార్యను హత్య చేస్తామని బెదిరించారని చంద్రపాల్ ఈ వీడియోలో వివరించాడు. వీరిపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసులను కోరాడు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంతోష్ను అరెస్ట్ చేసి మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.