హైదరాబాద్ : ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని లైంగిక దోపిడీకి గురిచేయడమే కాకుండా వారి ఆభరణాలు, నగదు దోచుకునే వ్యక్తిని రాచకొండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుండి 3.9 లక్షల విలువ చేసే ఆభరణాలు, నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలానికి చెందిన కూరగాయల వ్యాపారి హుస్సేన్ ఖాన్(46). ఖాన్ మొత్తం 30 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం..
కల్లు కంపౌండ్లలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని మొదటగా పరిచయం పెంచుకుంటాడు. డబ్బు ఆశ చూపించి వారిని వశపరుచుకుంటాడు. స్కూటర్పై నగర శివార్లలోని ప్రదేశాలకు తీసుకెళ్తాడు. ఈ క్రమంలో వారి ఆభరణాలను తన స్కూటర్ డిక్కీలో భద్రపరుస్తానని చెప్పి తీసుకుంటాడు. లైంగిక దోపిడీ అనంతరం వారికి డబ్బు ఇవ్వక, ఆభరణాలు ఇవ్వక మాటలతో ఏమార్చి అక్కడి నుండి తప్పించుకు పారిపోతాడు. ఇటీవల జిల్లేలగూడ కల్లు కంపౌండ్లో ఓ మహిళను ఇదే విధంగా మోసం చేశాడు. ఆమె వద్ద ఉన్న రూ.2,500 తీసుకుని పారిపోయాడు. ఖాన్ను గోపాలపురం పోలీసులు 2016లో ఓసారి అరెస్టు చేశారు. ఇతడిపై పీడీ యాక్ట్ను అమలు చేసినట్లు తెలిపారు.