లక్నో: భార్యతో గొడవపడుతున్న వ్యక్తిని వారించినందుకు పొరుగింటి వ్యక్తిని చావబాదిన నిందితుడి ఉదంతం యూపీలోని బరేలిలో వెలుగుచూసింది. బరేలిలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడు నవీన్ కుమార్ గత నెలలో ఉద్యోగం కోల్పోగా రోజూ భార్య దీప్ మాలతో వాగ్వాదానికి దిగేవాడు. ఎప్పటిలాగే సోమవారం సైతం భార్యతో గొడవపడ్డాడు. ఘర్షణ ముదిరి దీప్ మాలను నవీన్ కర్రతో కొట్టడంతో పొరుగున ఉన్న అర్జున్ అడ్డుకున్నాడు.
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన నవీన్ అర్జున్ ను దారుణంగా కొట్టాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు వారించి బాధితుడిని కాపాడారు. అనంతరం అర్జున్ ను కుటుంబ సభ్యులు సత్వరమే ఆస్పత్రికి తరలించకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి నిందితుడిపై ఫిర్యాదు చేశారు. ఆపై ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ అర్జున్ మరణించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఇంతవరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. తలకు బలమైన గాయం కావడంతోనే అర్జున్ మరణించాడని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు.