న్యూఢిల్లీ: పందుల పెంపకంపై వివాదం నేపథ్యంలో తుపాకీ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలోని జీబీటీ ఎన్క్లేవ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సందీప్ చందోలియా కుటుంబం పందులను పెంచుతున్నది. పొరుగున ఉన్న విక్కీ కుటుంబం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఇరు కుటుంబాలు ఈ విషయంపై ఘర్షణకు దిగాయి. దీంతో ఇరువర్గాల ఫిర్యాదుపై కేసులు నమోదు చేశారు.
పందుల పెంపకం విషయంలో ఆదివారం సాయంత్రం ఈ రెండు కుటుంబాల మధ్య మరోసారి గొడవ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చి సర్ది చెప్పారు. కాగా, సోమవారం తెల్లవారుజామున తుపాకీ కాల్పుల్లో ఇద్దరు గాయపడినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.
విక్కీ, రాకీ జరిపిన కాల్పుల్లో సందీప్ కుటుంబానికి చెందిన వికాశ్, సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా వికాశ్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కడుపులో బులెట్ గాయమైన సురేష్కు చికిత్స అందిస్తున్నారు. నిందితులు విక్కీ, రాకీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.