సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): ఐడీఏ బొల్లారం ప్రాంతంలో ఉదయం ఆరు గంటలకు కాలుష్య తీవ్రత 70 ఉంటే అదే ప్రాంతంలో రాత్రి 8 గంటలకు 23 కు చేరుతున్నది. అంటే కాలుష్య తీవ్రతలో వ్యత్యాసం 47 శాతం. ఇలా ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు హైదరాబాద్ మహా నగరంలోని అనేక ప్రాంతాల్లోనూ కాలుష్య తీవ్రత ఉదయం ఉదయం 11 గంటల వరకు సాధారణ స్థాయిని మించితే.. రాత్రి వరకు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నట్లు సీపీసీబీ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. అయితే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిబంధనలను సడలించింది. ఈ క్రమంలోనే నగరంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లక్షల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. దీంతో నగరంలో ఒక్కసారిగా కాలుష్య తీవ్రత పెరుగుతున్నది. సాధారణ స్థాయి నుంచి మోడరేట్ వరకు కాలుష్య తీవ్రత నమోదు అవుతుంది. అయితే ఈ వాహనాల రాకపోకలు సుమారు 11 గంటల వరకు సాగుతుండటం.. ఆ తర్వాత తగ్గుతుండటంతో నగరంలో 11 గంటల తరువాతనే కాలుష్య తీవ్రత క్రమంగా తగ్గుతున్నట్లు సీపీసీబీ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెక్కలు సూచిస్తున్నాయి. ఉదయం 11 గంటల వరకు మోడరేట్ స్థాయిలో ఉన్న కాలుష్య తీవ్రత క్రమంగా తగ్గుతూ రాత్రి 8 నుంచి 9 గంటల వరకు సాధారణం కంటే కిందికి పడిపోతున్నాయి.