పట్నా : వివాహేతర బంధం నిండు కుటుంబంలో మంటలు రేపింది. అక్రమ సంబంధం నెరపుతున్నారనే ఆగ్రహంతో భార్య ప్రియుడికి నిప్పంటించిన వ్యక్తి ఉదంతం భోపాల్లో మంగళవారం వెలుగుచూసింది. ఈ ఘటనలో 50 శాతం పైగా కాలిన గాయాలైన బాధితుడిని చికిత్స నిమిత్తం ఝాన్సీ మెడికల్ కాలేజ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..భోపాల్కు చెందిన బాధితుడు అరవింద్ అహిర్వార్ నిందితుడి భార్య అర్చనాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
అహిర్వార్తో అర్చన డేటింగ్ చేయడం నిందితుడు శేఖర్కు ఆగ్రహం తెప్పించింది. భర్త హెచ్చరిస్తున్నా పెడచెవిన పెట్టిన అర్చన తరచూ అహిర్వార్ను కలవడం కొనసాగిస్తోంది. వీరిద్దరూ ఇటీవల ఇండోర్ వెళ్లారు. అర్చన గురించి మాట్లాడాలని అహిర్వార్ను ఝాన్సీకి పిలిపించిన శేఖర్ అతడిని నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడ నుంచి పరారయ్యాడు. బాధితుడి కేకలు విన్న స్ధానికులు అతడిని కాపాడారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని చికిత్స కోసం ఝాన్సీ మెడికల్ కాలేజ్కు తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు నిందితుడు శేఖర్తో పాటు అతని భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపామని పోలీసులు తెలిపారు.