మెదక్, ఏప్రిల్ 24 : ఇక ప్రైవేట్ దవాఖానల్లోనూ కరోనా చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు మెదక్ జిల్లాలో 52 ప్రైవేట్ దవాఖానల్లో కరోనా చికిత్స అందించనున్నారు. జిల్లాలోని ఆయా ప్రైవేట్ దవాఖానల్లో పడకలతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ సౌకర్యాలు ఉన్నాయి. రోజురోజుకూ కరోనా వ్యాధి బారినపడిన వారి సంఖ్య పెరుగుతుండటంతో చికిత్సలు పొందడానికి హైదరాబాద్లోని ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకు వెళ్తున్నారు. దీంతో దవాఖానల్లో పడకలు సరిపోకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మెదక్ జిల్లాలో 52 ప్రైవేట్ దవాఖానల్లో 605 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఆయా దవాఖానల పరిధిలో 72 మంది డాక్టర్లు, 193 మంది సిబ్బంది ఉన్నారు. ప్రతి ప్రైవేట్ దవాఖానకు వైద్యారోగ్యశాఖ అధికారులు ఐడీ, పాస్వర్డ్ను కేటాయించారు. ప్రతిరోజు చికిత్స అం దించిన రోగుల వివరాలతోపాటు బెడ్ల ఖాళీలను తప్పకుండా పొందుపర్చాల్సి ఉంటుంది. గతేడాది కరోనా వ్యాప్తి ప్రారంభం కాగానే జిల్లా కేంద్ర దవాఖానలో 10 పడకలతో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆక్సిజన్ సిలిండర్లు, ఐసీయూ అందుబాటులోకి రావడంతో రోగులు ఇక్కడే చికిత్స పొందారు. రెండో దశలో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో నర్సాపూర్ ఏరి యా దవాఖాన, తూప్రాన్, రామాయంపేట సీహెచ్సీల్లో కరోనా రోగులకు చికిత్సలు అందించడానికి ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు.
మెదక్రూరల్, ఏప్రిల్ 24 : ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని హవేళీఘన్పూర్ మండల పీహెచ్ సీ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం మండలంలోని తిమ్మనగర్ పంచాయతీలో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి దూ రంగా ఉండవచ్చున్నారు. ప్రజలు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. తిమ్మనగర్లో సాయంత్రం వరకు 306 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు వైద్యసిబ్బంది ఉన్నారు.
మెదక్, ఏప్రిల్ 24 : మెదక్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రజలు కరోనా వ్యాక్సినేషన్ కోసం పరుగులు తీస్తున్నారు. శనివారం జిల్లాలోని 24 కేంద్రాల్లో 3,899 మందికి కరోనా వ్యాక్సినేషన్ వేసినట్లు డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్రావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 82 వేల మందికి వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు. మొదటి డోస్లో 75,256 మంది టీకా వేసుకోగా, రెండో డోస్లో 6801 మంది టీకా వేసుకున్నారని తెలిపారు. మొత్తం 82వేల మందికి టీకా వేశామని చెప్పారు. కరోనా వైరస్ ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కరోనా పాజిటివ్ వచ్చిన రోగికి తప్పకుండా వైద్యం అందించాలి. జిల్లాలో 52 ప్రైవేట్ దవాఖానల్లో చికిత్సలు చేయడానికి అనుమతిని ఇచ్చాం. ప్రతి దవాఖానకు ఐడీ పాస్వర్డ్ను కేటాయించాం. ప్రతిరోజు చికిత్స అందించిన రోగుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. -వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్వో మెదక్