లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలకు బ్రేక్ పడటం లేదు. కౌశంబి గ్రామంలో 16 ఏండ్ల దళిత బాలికపై భార్య సమక్షంలోనే ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో న్యాయస్ధానం ఆదేశాల మేరకు దంపతులపై కేసు నమోదు చేశారు. నిందితులపై బాధితురాలి తల్లి పశ్చిమ సరీరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ ఏడాది జనవరి 14న నిందితుడి భార్య బాలికను తన భర్తకు అప్పగించగా అతడు భార్య సమక్షంలోనే బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని వారు బాధితురాలి కుటుంబసభ్యులను హెచ్చరించారు.
పోలీసులు ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో మహిళ న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. న్యాయస్ధానం ఉత్తర్వులతో నిందితులైన దంపతులపై కేసు నమోదు చేశామని వారిని అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నామని స్టేషన్ అధికారి సర్వేష్ సింగ్ వెల్లడించారు.