ముంబై : అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో అధికారిని అంటూ ఓ వ్యక్తి ఫ్యాషన్ డిజైనర్ను (28) రూ 9.65 లక్షలకు ముంచిన ఘటన మహారాష్ట్రలోని పూణేలో శుక్రవారం వెలుగుచూసింది. ఓ మ్యాట్రిమోనియల్ సైట్లో తనకు పరిచయమైన నిందితుడు తాను యూఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో పనిచేస్తానని నమ్మబలుకుతూ ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో తనను భారీ మొత్తానికి బురిడీ కొట్టించాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు బారామతిలో వాటర్ ఫిల్టర్ టెక్నీషియన్గా పనిచేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అమిత్ చవాన్గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు రాహుల్ పాటిల్ పేరుతో మ్యాట్రిమోనియల్ సైట్లో రిజిస్టర్ చేసుకోగా ఆ వేదికపై అతడికి మహిళ పరిచయమైంది. తాను భారత్, దుబాయ్ దేశాలకు అమెరికన్ ఇంటెలిజెన్స్ అధికారినని ఆమెకు నమ్మబలికాడు.
గుజరాత్లో తన బంధువులు ఆమెకు తక్కువ ధరలో వస్త్రాలు కొనుగోలు చేసేందుకు సహకరిస్తారని చెప్పుకొచ్చాడు. ఈ సాకుతో బాధితురాలి స్మార్ట్ఫోన్, డెబిట్ కార్డు, పిన్ నెంబర్ తీసుకున్న నిందితుడు పలు ఏటీఎంల నుంచి రూ 8.37 లక్షలు విత్డ్రా చేశాడు. ఈ క్రమంలో అతడు ఇంటెలిజెన్స్ అధికారి కాదని అనుమానించిన మహిళ తాను మోసపోయానని గుర్తించారు. నిందితుడిని పట్టుకోవడంలో విఫలమైన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.