చండీగఢ్: తండ్రి ఆస్తులను పంచగా, తనకు తక్కువ వాటా వచ్చిందన్న ఆగ్రహంతో తమ్ముడ్ని అన్న హత్య చేశాడు. పంజాబ్లోని లుధియానాలో ఈ ఘటన జరిగింది. హర్దీప్ సింగ్ అనే వ్యక్తికి పల్విందర్ సింగ్, గగన్ దీప్ సింగ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ‘లక్కీ బేకరీ’ పేరుతో లుధియానాలో పలు షాపులు ఆ కుటుంబానికి ఉన్నాయి. పల్విందర్ సింగ్ తన కుటుంబంతో సంత్ ఫతే సింగ్ నగర్లో నివసిస్తున్నాడు. తమ్మడు గగన్దీప్ సింగ్ తన భార్య, పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్ద బసంత్ అవెన్యూలో ఉంటున్నాడు.
కాగా, హర్దీప్ సింగ్ ఇటీవల తన ఇద్దరు కుమారులకు ఆస్తులను పంచారు. అయితే తనకు తక్కువ వాటా రావడంపై పల్విందర్ సింగ్ అసంతృప్తి చెందాడు. దీనిపై చర్చించేందుకు తమ్ముడు గగన్దీప్ సింగ్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉన్న తండ్రి, సోదరుడితో ఆస్తి పంపకాల్లో తేడాపై గొడవకు దిగాడు.
ఈ క్రమంలో ఆగ్రహావేశాలకు లోనైన పల్విందర్ సింగ్, తమ్ముడు గగన్దీప్ వద్ద ఉన్న తుపాకీ తీసుకుని కుటుంబ సభ్యులంతా చూస్తుండగా అతడిపైకి కాల్పులు జరిపాడు. ఒక తూట తలలోకి దూసుకెళ్లడంతో గగన్దీప్ సింగ్ అక్కడే మరణించాడు. అనంతరం పల్విందర్ సింగ్ అక్కడి నుంచి పారిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు అనంతరం పల్విందర్ సింగ్ కోసం గాలించి అరెస్ట్ చేశారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.