లక్నో : ఆరు నెలల కిందట అదృశ్యమైన వ్యక్తి మిస్టరీని యూపీలోని మీరట్ పోలీసులు చేధించారు. స్నేహితుడే అతడిని హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడని, బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై నిందితుడితో పాటు అతడి భార్యను అరెస్ట్ చేశామని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్ జిల్లా కిధోర్ పట్టణానికి చెందిన మేస్త్రీ పనిచేసే బాధితుడు నసీం గర్ముక్తేశ్వర్లో హీనా అనే యువతితో సహజీవనం చేస్తూ ఓ ఇంట్లో నివసిస్తున్నాడు. తరచూ అక్కడికి వచ్చే నసీం స్నేహితుడు డానిష్ ఫ్రెండ్ భార్యపై కన్నేశాడు.
క్రమంగా హీనాకు దగ్గరవడంతో వారిద్దరి వ్యవహారం నసీంకు తెలిసి వారిని మందలించాడు. దీంతో కోపం పెంచుకున్న డానిష్ స్నేహితుడు అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని మార్చి 17న అతడిని కడతేర్చి అమ్రోహ జిల్లాలోని ఓ కాలువలో పడేశాడు. మరుసటి రోజే నసీం మృతదేహం లభ్యమైనా పోలీసులు గుర్తించలేకపోవడంతో దహనం చేశారు. ఆపై కొద్దిరోజులకు డానిష్ హీనాను పెండ్లి చేసుకుని అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు.
ఈ క్రమంలో పొరుగింటి మహిళతో ఇటీవల గొడవపడిన డానిష్ తాగిన మైకంలో నసీంను తానే హత్య చేశానని, తాను ఎన్నో నేరాలు చేశానని తనతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించడంతో హత్య వ్యవహారం వెలుగుచూసింది. ఇక ఈ విషయం నేరుగా నసీం తల్లితండ్రులకు ఆమె వెల్లడించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా హీనాను దక్కించుకునేందుకు నసీంను హత్య చేసి కాలవలో పడేశానని డానిష్ తన నేరాన్ని అంగీకరించాడు. డానిష్, హీనాలను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.