న్యూఢిల్లీ: బంగారం అంటే అతివలకు అమితమైన ప్రేమ.. అలాగే అనిశ్చిత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు ఇష్టమైందీ గోల్డే.. కరోనా మహమ్మారి విశ్వరూపం చూపడంతో పారిశ్రామిక, ఆర్థిక లావాదేవీలు స్తంభించినప్పుడు ఇన్వెస్టర్లకు స్వర్గధామంగా మారిన బంగారంపై పెట్టుబడులు పెట్టడంతో గతేడాది ఆగస్టులో దేశీయ మార్కెట్లో ఆల్టైమ్ రికార్డు ధర నమోదు చేసుకున్నది. తులం బంగారం రూ.56,310 అత్యంత గరిష్ఠ ధర పలికితే.. గతవారం రూ.43 వేల చేరువలోకి పడిపోయి.. తాజాగా మంగళవారం మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.45,820ని తాకింది.
బంగారం ధరల్లో సర్దుబాట్లతో ఆభరణాల కొనుగోలుకు డిమాండ్ పెరుగుతుందన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే మే నెలలో వివాహాలు, అక్షయ తృతీయ సందర్భంగా వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్ను అందుకునేందుకు జ్యువెల్లరీ దుకాణాలు బంగారం కొనుగోళ్లు చేపట్టారు. కానీ బంగారంపై పెట్టుబడి పెట్టడానికి డిమాండ్ ఇంకా ఊపందుకోలేదని అభిప్రాయం వినిపిస్తున్నది.
ఇటీవల బంగారం ధరల్లో కరెక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు దానిలో పెట్టుబడులకు అనుకూలంగా మార్చుకుంటారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 2019, 2020ల్లో బంగారం ధరల్లో ఒడిదొడుకులు, హెచ్చుతగ్గుదల తీరును అర్థం చేసుకోగలిగితే, పరిణామాలను అవగాహన చేసుకుంటే సరైన సమాధానం వస్తుందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు, డాలర్పై రూపాయి మారకం విలువపై కూడా భారత్లో బంగారం కొనుగోళ్లకు డిమాండ్ ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే..
ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొన్నప్పుడు ఇన్వెస్టర్లకు స్వర్గధామం బంగారమే. కొవిడ్-19 ఉధ్రుతి ప్రభావం తీవ్రస్థాయికి చేరిన 2020 ప్రారంభ దశలోనూ అది నిజమేనని రుజువైంది. కానీ ప్రస్తుతం గ్లోబల్ ఎకనమిక్ ఔట్లుక్ మారుతున్నది. క్రమంగా వివిధ దేశాల్లో ఆర్థిక లావాదేవీల ప్రక్రియ పుంజుకుంటున్నది. దాదాపు అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ జరుగుతున్నది. ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న అనిశ్చితి క్రమంగా తొలగిపోతున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగారం ధర కనిష్ఠ స్థాయికి పడిపోయి.. మళ్లీ మరో ఆల్టైం రికార్డు నెలకొల్పుతుందన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆర్థిక అనిశ్చితి కంటే వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు, ప్రభుత్వాల విధానాలను బట్టి బంగారం ధరలపై ప్రభావం ఉంటుంది. కరోనా ప్రభావం నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)తో సహా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యపరపతి విధానాన్ని మరింత సరళతరం చేయడానికే ప్రాధాన్యం ఇస్తాయి. పారిశ్రామిక, ఆర్థిక సేవలకు సరిపడా డబ్బు అందుబాటులో ఉండేలా చూస్తాయి. అదనపు నిధులు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నించినప్పుడు బంగారం, ప్రభుత్వం జారీ చేసే బాండ్ల ధరలపై ప్రభావం పడుతుంది.
ఆర్థిక లావాదేవీలు క్రమంగా ఊపందుకుంటుండటంతో ఇన్వెస్టర్లు ఈక్విటీలు, తక్కువ క్వాలిటీ గల కార్పొరేట్ బాండ్ల కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తారు. వాటి నుంచి అధిక లాభాలు గడించాలని ఆశిస్తారు. కనుక ఇన్వెస్టర్లు బంగారం, ప్రభుత్వ రంగ బాండ్లపై కంటే రిస్కీ కార్పొరేట్ బాండ్లు, ఈక్విటీలపై పెట్టుబడులు పెట్టడానికి మొగ్గుచూపుతారు. ఇంతకుముందు అమెరికా డాలర్ బలహీనపడినా కొద్దీ బంగారం ధర పెరుగుతూ వచ్చింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం, కరోనా వల్ల డాలర్ బలహీనపడి 2019,2020ల్లో బంగారం పెరుగడానికి కారణం.
అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి గతవారం 1.9 లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన పథకం ప్రకటించడంతో ద్రవ్యోల్బణం కూడా పెరిగి.. బంగారం డిమాండ్ ఎక్కువ అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీర్ఘకాలంపాటు బంగారం ధరలు పెరుగబోవని బులియన్ మార్కెట్ వర్గాలు అంటున్నారు. జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ కమోడిటీస్ రీసెర్చ్ హెడ్ హరీశ్ వీ మాట్లాడుతూ బంగారం ధరల పెరుగుదల పర్వం ముగిసినట్లేనని పేర్కొన్నారు. ఇప్పటికే ఔన్స్ బంగారం ధర 1760 డాలర్లను చేరుకున్నదన్నారు. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు అదనపు లాభాల కోసం బంగారం కొనుగోలు చేయొద్దని బులియన్ వర్గాల అభిప్రాయం. ఇన్వెస్టర్లు 10-15 శాతం వరకు బంగారంపై పెట్టుబడులు పెట్టొచ్చునని ఆ వర్గాలు పేర్కొన్నాయి.