ముంబై : యూపీలోని మీరట్ కు చెందిన ఓ ప్రైవేట్ ల్యాబ్ లో కొవిడ్-19 డ్రగ్ ఫావిపిరవిర్ ను తయారుచేస్తున్న ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని సందీప్ మిశ్రాగా గుర్తించిన పోలీసులు అతడు ఎప్పటి నుంచి నకిలీ మందులు తయారుచేస్తున్నాడనేది ఆరా తీస్తున్నారు. ముంబైలోని ముగ్గురు డ్రగ్ డీలర్లపై దాడులు చేపట్టిన సందర్భంగా మిశ్రా నకిలీ మందుల రాకెట్ వెలుగుచూసింది.
దర్యాప్తులో భాగంగా మిశ్రా ట్యాబ్లెట్లు తయారుచేస్తుండగా మరో నిందితుడు వాటిని ప్యాక్ చేసి డీలర్లకు పంపుతాడని వెల్లడైంది. ముఖర్జీ అనే మరో నిందితుడు వాటిని హోల్ సేల్ గా విక్రయిస్తాడని గుర్తించారు. మరోవైపు గుజరాత్ లోనూ ఇటీవల నకిలీ మందుల తయారీ రాకెట్ ను అధికారులు చేధించారు. గ్లూకోజ్ వాటర్, ఉప్పును కలిపి రెమ్డిసివిర్ ఇంజక్షన్లు తయారు చేసి మధ్యప్రదేశ్ కు సరఫరా చేస్తున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.