ముంబై : చైన్ స్నాచింగ్ కేసులో అల్లుడు జైల్లో ఉండగా.. అత్త తన బిడ్డకు రెండో పెళ్లి చేసింది. జైలు నుంచి విడుదలైన అల్లుడికి ఈ విషయం తెలియడంతో అత్తను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలోని విలే పార్లేలో చోటు చేసుకుంది.
ముంబైకి చెందిన ఓ వ్యక్తికి కొన్నేండ్ల క్రితం వివాహమైంది. అయితే అతను చైన్ స్నాచింగ్ కేసులో దొరికిపోవడంతో.. జైలు పాలయ్యాడు. మూడేండ్ల పాటు జైలు శిక్ష విధించడంతో.. అతని భార్య తన తల్లితో ఉంటోంది. ఈ క్రమంలో అత్త తన బిడ్డకు రెండో పెళ్లి చేసింది. ప్రస్తుతం ఆమె గర్భిణి. సెప్టెంబర్ ఒకటో తేదీన మొదటి భర్త జైలు నుంచి విడుదలయ్యాడు.
ఆ తర్వాత నేరుగా అత్తగారింటికి వెళ్లాడు. తన భార్య రెండో పెళ్లి చేసుకున్నదని, ప్రస్తుతం గర్భిణి అని అతనికి తెలిసింది.
తన వెంట రావాలని, రెండో భర్తను వదిలేయాలని భార్యను కోరాడు. మొదటి రోజు భార్యకు నచ్చజెప్పి తిరిగి వెళ్లాడు. రెండో రోజు అత్తగారింటికి వచ్చి చూసేసరికి.. భార్య కనిపించకుండా పోయింది. దీంతో అత్తను నిలదీశాడు. ఆమె సరైన సమాధానం చెప్పలేదు. భార్య ఎక్కడికి వెళ్లిందో చెప్పలేదు.
కోపంతో ఊగిపోయిన అతను.. అత్తపై కత్తితో దాడి చేసి చంపేశాడు. ఆమె ప్రయివేటు భాగాల్లో కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.