న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ సారథి, సీఎం మమతా బెనర్జీపై నందిగ్రాం నుంచి సువేందు అధికారిని బరిలో దింపాలని కాషాయ కూటమి నిర్ణయించింది. బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను ఖరారు చేసేందుకు గురువారం మధ్యాహ్నం జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలో సువేందు అధికారి అభ్యర్ధిత్వంపై సమాలోచనలు సాగాయి.
ఇక నందిగ్రాం నుంచి పోటీ చేయనున్న మమతా బెనర్జీ ఈనెల 11న నామినేషన్ వేయనున్నారు. మరోవైపు దీదీపై సువేందు అధికారిని పోటీ చేయించాలని బీజేపీ దాదాపు ఓ నిర్ణయానికి వచ్చింది. నందిగ్రాం సీటును ఆశించే అభ్యర్ధుల జాబితాలో ఆయన పేరును చేర్చినట్టు పార్టీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో బీజేపీలో చేరిన సందర్భంగా తాను మమతా బెనర్జీని 50,000 ఓట్ల తేడాతో ఓడిస్తానని, లేకుంటే రాజకీయాల నుంచి వైదొలగుతానని సువేందు అధికారి పేర్కొన్నారు. ఇక మార్చి 27 నుంచి ఎనిమిది దశల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.