ముంబై: పెండ్లి పేరుతో యువతితో శృంగారం తర్వాత ఆమె మొబైల్ నంబర్ను ఒక వ్యక్తి బ్లాక్ చేశాడు. మోసపోయినట్లు గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్రలోని పూణేలో ఈ ఘటన జరిగింది. కర్ణాటకలోని బెల్గాం జిల్లా కుంపత్గిరి ప్రాంతానికి చెందిన ప్రశాంత్ భౌరావ్ పాటిల్ 2018లో ఆర్మీ నుంచి పారిపోయాడు. నాటి నుంచి మ్యాట్రిమోనియల్ పోర్టల్లో పరిచయమైన పలువురు మహిళలను అతడు మోసగించాడు.
31 ఏండ్ల ప్రశాంత్, తాజాగా మ్యాట్రిమోనియల్ పోర్టల్లో పరిచయమైన మరో యువతిని మోసగించాడు. తాను ఆర్మీలో పనిచేస్తున్నట్లు ఆమెను నమ్మించాడు. ఈ నెల 18న ఆర్మీ డ్రెస్లో ఉన్న అతడు దగ్దుషేత్ గణపతి ఆలయంలో ఆ యువతిని కలిశాడు. అనంతరం సింహగడ్ రోడ్డులోని లాడ్జిలో బస చేశారు. అక్కడ వారిద్దరూ పెండ్లి పేరుతో దండలు మార్చుకున్నారు.
అనంతరం షికారుకు వెళ్లిన సందర్భంగా కారులో బలవంతంగా తనతో శృంగారం చేసినట్లు ఆ మహిళ ఆరోపించింది. ఆర్మీ విధులకు వెళ్తున్నానని, తిరిగి వచ్చిన తర్వాత పెద్దల సమక్షంలో పెండ్లి చేసుకుంటానని నమ్మించాడని ఆమె తెలిపింది. లాడ్జీ నుంచి వెళ్లిన అనంతరం తన మొబైల్ నంబర్ను అతడు బ్లాక్ చేశాడని, అప్పటి నుంచి కాంటాక్ట్లో లేడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పెండ్లి పేరుతో మోసపోయిన యువతి ఫిర్యాదు ఆధారంగా ప్రశాంత్ పాటిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది నవంబర్ 20 వరకు పూణే, లాతూర్, అహ్మద్నగర్లో అతడిపై ఐదు కేసులు నమోదయ్యాయని తెలిపారు. కోర్టులో ప్రవేశపెట్టగా పోలీస్ కస్టడీకి అప్పగించినట్లు తెలిపారు. దీంతో అతడు చేసిన మోసాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.