చెన్నై : బాకీ తీర్చలేదని అప్పు ఇచ్చిన వ్యక్తి అమానుషంగా వ్యవహరించారు. రుణం తీసుకున్న వ్యక్తి ముగ్గురు కూతుళ్లతో పాటు మరో యువతిని తన నిర్బంధంలోకి తీసుకున్నాడు. తమిళనాడులోని తిరువనమలై జిల్లాలోని అర్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం వెలుగుచూసింది. నిందితుడు రాజన్ ఏడాది కిందట తన భార్య సోదరుడు, పెరియనగర్కు చెందిన రఘు (48)కు రూ 2.8 లక్షలు అప్పుగా ఇచ్చాడు. కరోనా మహమ్మారితో రఘు ఉద్యోగం కోల్పోడంతో రాజన్ నుంచి తీసుకున్న డబ్బును సకాలంలో చెల్లించలేకపోయాడు.
వడ్డీ కూడా చెల్లించలేని పరిస్ధితిలో రఘు, రాజన్ మధ్య తరచూ గొడవలు జరిగేవి. రఘు తనకు సంబంధించిన వస్తువులు కొన్నింటిని అమ్మి రూ 40,000 రాజన్కు చెల్లించాడు. మిగిలిన మొత్తం ఇచ్చేందుకు తనకు కొంత సమయం ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలో తన ముగ్గరు కూతుళ్లు, మరో పొరుగింటి బాలికను ఇంట్లో ఉంచి సోమవారం రఘు తన భార్యతో కలిసి బయటకు వెళ్లాడు. ఈ సమయంలో రాజన్ మరికొందరితో కలిసి ఇంట్లోకి వచ్చిన రాజన్ నలుగురు బాలికలను ఓ గదిలో బంధించాడు. విషయం తెలుసుకున్న రఘు దంపతులు తిరిగి ఇంటికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు బాలికలను విడిపించారు. రఘు ఫిర్యాదు ఆధారంగా రాజన్ను అరెస్ట్ చేశారు.