అహ్మదాబాద్ : సోషల్ మీడియా వేదికలపై మైనర్ బాలికలు, మహిళలతో స్నేహం పెంచుకుని ఆపై డబ్బు కోసం వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని గుజరాత్లోని ఆనంద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు జగదీష్ సింఘా (29) స్నాప్చాట్, ఫేస్బుక్ వీడియో కాల్స్లో మహిళలు, బాలికలను దుస్తులు తొలగించాలని కోరి వారు అలా చేయగానే స్క్రీన్ షాట్ తీసేవాడు. ఆపై ఆ ఫోటోలను ఇంటర్నెట్లో వైరల్ చేస్తానని బెదిరిస్తూ బాధితుల నుంచి డబ్బు గుంజేవాడు. పోలీసులు నిందితుడి మొబైల్ ఫోన్ నుంచి మహిళల నగ్న, ఆర్ధ నగ్న ఫోటోలను సీజ్ చేశారు. నిందితుడిపై ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
జగదీష్ సింఘాతో తాను ఇటీవల టచ్ లోకి వచ్చానని, తాము తరచూ సోషల్ మీడియాలో చాట్ చేసేవారమని 19 ఏండ్ల బాలిక పోలీసులకు తెలిపింది. వీడియో కాల్స్లో మాట్లాడుతుండగా తనను దుస్తులు తొలగించాలని కోరి ఆపై తాను అలా చేయగా స్ర్కీన్ షాట్ తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. రూ 50,000 చెల్లించకుంటే వాటిని వైరల్ చేస్తానని బెదిరించాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని ఆనంద్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి వివాహమైందని, కాంపిటీటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేరవుతున్నాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడికి చెందిన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజ్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పరీక్షించేందుకు పంపామని తదుపరి దర్యాప్తు వేగవంతం చేశామని ఆనంద్ జిల్లా డిప్యూటీ ఎస్పీ బీడీ జడేజా పేర్కొన్నారు.