న్యూఢిల్లీ : మరదలిపై కన్నేసిన ప్రబుద్ధుడు తన కోరికను తీర్చేందుకు అంగీకరించలేదని ఆమెపై యాసిడ్ తరహా ద్రావణాన్ని పోసిన ఘటన ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్ లో వెలుగుచూసింది. 17 ఏండ్ల బాలిక సోమవారం రాత్రి తల్లి పక్కన నిద్రిస్తుండగా నిందితుడు ఆమెపై కెమికల్ ను వెదజల్లాడు. బాధితురాలి అక్కను నిందితుడు ఆరేండ్ల కిందట వివాహం చేసుకున్నాడు. మరదలిపై కన్నేసిన నిందితుడు పలుమార్లు ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించాడు.
నిందితుడి ఉద్దేశాన్ని బాధితురాలి కుటుంబసభ్యులు పసిగట్టినా అతడిలో మార్పు రాలేదు. గార్మెంట్ ఫ్యాక్టరీలో క్లర్క్ గా పనిచేసే నిందితుడు (25) బాలికను తన కోరిక తీర్చాలని తరుచూ వేధించేవాడు. ఈ క్రమంలో నిద్రిస్తున్న బాలికపై ద్రావణాన్ని పోసిన నిందితుడు ఏమీ తెలియనట్టు పక్క గదిలోకి వెళ్లాడు. బాలికను ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా నేరం చేసినట్టు నిందితుడు అంగీకరించాడు.