హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): గతేడాది లాక్డౌన్ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోకముందే పరిశ్రమలపై మరోసారి కరోనా పంజా పడింది. పెరుగుతున్న కరోనా కేసులు, మళ్లీ లాక్డౌన్ వస్తుందనే భయాలతో ఇతర రాష్ర్టాల కార్మికులు క్రమంగా సొంతూళ్లకు పయనమవుతున్నారు. మరోవైపు దిగుమతులు నిలిచిపోవడంతో ముడిసరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే ప్లాస్టిక్ ధరలు రెట్టింపయ్యాయి. సిమెంట్, స్టీల్ రేట్లు కూడా భారీగా పెరిగాయి. రాష్ట్రంలోని ప్లాస్టిక్ పరిశ్రమలకు గుజరాత్, మహారాష్ట్రలోని రిలయన్స్, గెయిల్ సంస్థలనుంచే ఎక్కువగా ముడిసరుకు దిగుమతి అవుతుంది. ఆ రెండు రాష్ర్టాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో కార్మికులు స్వరాష్ర్టాల బాట పట్టారు. దీంతో అక్కడ ఉత్పత్తితోపాటు రవాణా కూడా తగ్గిపోవడంతో ప్లాస్టిక్ ముడిసరుకుకు రెక్కలొచ్చాయి. గతంలో రూ.8వేలు ఉన్న టన్ను ప్లాస్టిక్ ధర ఇప్పుడు రూ.15వేలకు ఎగబాకింది.
ఏడాది నుంచి ఒడిదొడుకులే
వాస్తవానికి గతేడాది మార్చిలో మొదలైన లాక్డౌన్ నుంచే పలు పరిశ్రమలు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోవడం, పరిశ్రమలు దాదాపు ఆర్నెళ్లపాటు మూతపడటంతో చిన్నాచితకా పరిశ్రమలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. బ్యాంకు రుణాలు చెల్లించే స్థోమతలేక పోవడంతోపాటు నిలిచిపోయిన పరిశ్రమలను మళ్లీ పట్టాలెక్కించేందుకు నానా తంటాలు పడ్డారు. ఉద్యోగులను, వేతనాలను కుదించడం, అనవసర ఖర్చులను తగ్గించుకోవడం, లేబర్పై ఆధారపడడం తగ్గించి టెక్నాలజీ వినియోగం పెంచటం, విక్రయాలు పెంచుకొనేందుకు మార్కెటింగ్కు ఎక్కువ ఖర్చుచేయడం తదితర చర్యలతో నష్టాలను అధిగమించేందుకు పరిశ్రమవర్గాలు కృషిచేస్తున్నాయి. కానీ, మూలిగే నక్కపై తాటిపండు పడినట్టుగా మళ్లీ కరోనా ఉగ్రరూపం దాల్చడంతో పరిశ్రమవర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.
స్టీల్ తయారీకి ఆక్సిజన్ బంద్
ఉక్కు తయారీ పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరా నిలిపివేయడం తీవ్ర ప్రభావం చూపుతున్నది. కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలిండర్ల అవసరం పెరగడంతో స్టీల్ పరిశ్రమలకు సరఫరాను నిలిపివేశారని, దీంతో ఉత్పత్తి తగ్గిపోయి, ధరలు పెరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో రూ.42 వేలు పలికిన టన్ను ఉక్కు.. ఇప్పుడు రూ.50 వేలకు చేరినట్టు చెప్తున్నారు. మరోవైపు సిమెంట్ ధరలు కూడా టన్నుకు దాదాపు రూ.1500 వరకూ పెరిగాయి. మహారాష్ట్ర, గుజరాత్లో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ర్టాల కార్మికులు క్రమంగా సొంతూళ్లకు ప్రయాణమవుతుండటంతో ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.