అహ్మదాబాద్ : డేటింగ్ కు నిరాకరించడంతో ఓ యువతిని సోషల్ మీడియా వేదికగా వేధించిన వ్యక్తి ఉదంతం గుజరాత్ లో వెలుగుచూసింది. తనతో సన్నిహితంగా మెలిగేందుకు 23 ఏండ్ల యువతి నిరాకరించడంతో ఆమెను వేధించేందుకు నిందితుడు పన్నెండు ఇన్ స్టా గ్రాం ఖాతాలను తెరిచాడు. థాట్లెజ్ లోని ఓ ప్రైవేట్ దవాఖానలో బాధిత యువతి ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తోంది.
గత కొంత కాలంగా నిందితుడు తనను ఇన్ స్టా వేదికగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆరోపించారు. యువతికి వేరొకరితో ఇటీవల నిశ్చితార్ధం జరగ్గా అతడిని వదిలి తనతో సంబంధం పెట్టుకోవాలని నిందితుడు ఒత్తిడి తెచ్చాడు. అసభ్య మెసేజ్ లతో నిందితుడు వేధిస్తుండటంతో అతడిని బ్లాక్ చేసినా వరుసగా న్యూ ప్రొఫైల్స్ ఏర్పాటు చేసుకుని వేధించేవాడని బాధిత యువతి పేర్కొంది. వేధింపులతో విసిగిన బాధితురాలు సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.