అర్హులందరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలి
నర్సంపేట ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్
జిల్లాలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్
కరోనా టెస్టుల కోసం బారులు
నర్సంపేట, ఏప్రిల్ 21: కరోనా టీకాలపై అపోహలు విడనాడాలని నర్సంపేట ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్ అన్నారు. 45 ఏళ్లు నిండిన వారికి బుధవారం దవాఖానలో వ్యాక్సిన్ వేశారు. రెండో దశలో కరోనా వైరస్ విజృంభిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యాక్సిన్ నిల్వలు దవాఖానలో ఉన్నాయన్నారు.
సబ్జైలులో కరోనా పరీక్షలు
పరకాల: పట్టణంలోని సబ్జైలులో సిబ్బందికి, ముద్దాయిలకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు జైలు సూపరింటెండెంట్ ఎస్ ప్రవీణ్ తెలిపారు. జైలు ఆవరణలో పరకాల సివిల్ హాస్పిటల్ వైద్యుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో 15 మందికి పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్ వచ్చిందని వైద్యుడు తెలిపారు. అనంతరం సిబ్బందికి, ముద్దాయిలకు మాస్కులు, హ్యాండ్వాష్ జల్ పంపిణీ చేశారు.
అప్రమత్తతే ఆయుధం
దుగ్గొండి: కరోనా వైరస్ నివారణకు అప్రమత్తతే ఆయుధమని తిమ్మంపేట సర్పంచ్ విద్యాసాగర్గౌడ్ అన్నారు. గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో జీపీ సిబ్బంది, గ్రామస్తులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. గ్రామస్తులు విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. అందరూ మాస్కులు ధరించాలన్నారు. భౌతికదూరం పాటిస్తూ శానిటైజర్లు వాడాలన్నారు.
టీకా వేసుకున్న జడ్పీటీసీ, ఎంపీపీ
వర్ధన్నపేట: కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ను బుధవారం ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి సీహెచ్సీలో తీసుకున్నారు. టీకా వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. కార్యక్రమంలో నల్లబెల్లి ఎంపీటీసీ దుగ్యాల జ్యోతి, టీఆర్ఎస్ నాయకులు సింధం లక్ష్మీనారాయణ, దుగ్యాల మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
113 మందికి వ్యాక్సిన్..
చెన్నారావుపేట: మండలకేంద్రంలోని పీహెచ్సీలో బుధవారం 113 మందికి టీకాలు వేసినట్లు వైద్యాధికారి ఉషారాణి తెలిపారు. పీహెచ్సీ పరిధిలో 93 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 13 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. కార్యక్రమంలో సీహెచ్వో వెంకటేశ్వరరావు, స్టాఫ్నర్సు స్వరూపారాణి, లలిత, హెల్త్ అసిస్టెంట్ కుండె శివాజీ, సూపర్వైజర్ రామెల్, ఆరోగ్యమిత్ర ఆరె మహేందర్ పాల్గొన్నారు.
దామెర: మండలంలోని కోగిల్వాయిలో దామెర పీహెచ్సీ ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ శిరీష మాట్లాడుతూ ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. ప్రభుత్వం రాత్రిపూట విధించిన కర్ఫ్యూకు ప్రజలంతా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ గట్ల విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీటీసీ సంగనబోయిన మౌనిక-కిరణ్, ఉపసర్పంచ్ గోల్కొండ సాంబయ్య, కారోబార్ సురేశ్ పాల్గొన్నారు.
పర్వతగిరి: మండలంలోని గోపనపెల్లిలో కరోనా పరీక్షల క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పంజా మహేశ్ మాట్లాడుతూ కరోనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేసుకోవాలని సూచించారు. పాజిటివ్ వచ్చిన వారు వైద్యుల సూచనలు పాటిస్తూ హోం క్వారంటైన్లో ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రమేశ్, కార్యదర్శి సదానందం, హెచ్ఈవో జమాలొద్దీన్, ఏఎన్ఎం రజిత, షమీనాబేగం, ల్యాబ్ టెక్నీషియన్ వేణుగోపాల్, వార్డు సభ్యులు నరేశ్, ఆశ కార్యకర్తలు మంజుల, నవ్య, రాజు, 104 సిబ్బంది పాల్గొన్నారు.
వ్యాక్సిన్ కోసం బారులు
శాయంపేట: మండలకేంద్రంలోని పీహెచ్సీలో వ్యాక్సిన్ కోసం క్యూ కడుతున్నారు. బుధవారం 32 మందికి టీకాలు వేసినట్లు వైద్యాధికారి తెలిపారు. మొన్నటి వరకు టీకా తీసుకునేందుకు వెనుకంజ వేసిన వారు.. నేడు ప్రభుత్వం చేపట్టిన ప్రచారం, కరోనా కేసులు పెరుగుతుండడంతో వ్యాక్సిన్ మాత్రమే శ్రీరామరక్షగా భావించి ఉదయమే పీహెచ్సీకి చేరుకుంటున్నారు. పీహెచ్సీలో రోజుకు 100 నుంచి 150 మందికిపైగా వ్యాక్సిన్ వేస్తున్నట్లు వైద్యుడు తెలిపారు. కాగా, బుధవారం మండలంలో కొత్తగా 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పీహెచ్సీలో 67 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేయగా 24 మందికి, ఆరోగ్య ఉపకేంద్రాల్లో 52 మందికి పరీక్షలు చేయగా 9 మందికి పాజిటివ్గా తేలింది. పెద్దకోడెపాకలో 9 మందికి, పత్తిపాకలో 8 మందికి, గట్లకానిపర్తిలో ఒకరు, కాట్రపల్లిలో ఇద్దరు, వసంతాపూర్లో ఇద్దరు, నేరేడుపల్లిలో ఒకరు, నీరుకుళ్లలో ఒకరు, శాయంపేటలో ముగ్గురు, మైలారంలో ఇద్దరు, అప్పయ్యపల్లిలో ఒకరు, కొత్తగట్టుసింగారంలో ఇద్దరు, సూరంపేటలో ఒకరికి కరోనా వచ్చినట్లు వైద్యాధికారి వెల్లడించారు. మొత్తం 119 మందికి టెస్టులు చేయగా, 33 మందికి పాజిటివ్ వచ్చింది.
నర్సంపేట రూరల్: వ్యాక్సిన్పై ప్రజలు అపోహలకు గురికావొద్దని సర్పంచ్ల ఫోరం నర్సంపేట మండల అధ్యక్షుడు కొడారి రవన్న అన్నారు. భాంజీపేట పీహెచ్సీలో రవన్న వ్యాక్సిన్ తీసుకున్నారు. టీకా వేసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి భూపేశ్ పాల్గొన్నారు.
170 యాక్టివ్ కేసులు
సంగెం: మండలకేంద్రంలోని పీహెచ్సీలో 105 మందికి కరోనా పరీక్షలు చేయగా, 22 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి పొగాకుల అశోక్ తెలిపారు. మండలంలో 170 యాక్టివ్ కేసులు ఉన్నాయని, ఇందులో 166 మంది హోం ఐసొలేషన్లో ఉన్నట్లు తెలిపారు. నలుగురు దవాఖానలో చికిత్స పొందుతున్నారని వివరించారు. మొండ్రాయిలో 1, సంగెం 1, నల్లబెల్లి 1, రామచంద్రాపురం 4, ఎల్గూర్రంగంపేట 6, పల్లార్గూడ 2, కాట్రపల్లి 3, తీగరాజుపల్లి 1, కాపులకనపర్తి 1, వెంకటాపూర్లో ఒక పాజిటివ్ కేసు నమోదైనట్లు డాక్టర్ అశోక్ తెలిపారు.