హైదరాబాద్, మార్చి 18, (నమస్తే తెలంగాణ): నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం సంస్థ చరిత్రలోనే అతి ఎక్కువ నిధులను కేటాయించింది. వార్షిక బడ్జెట్లో రూ.1,500 కోట్లు ప్రతిపాదించగా.. బడ్జెటేతర నిధులు మరో రూ.1,500 కోట్లు కలిపి మొత్తం రూ.3,000 కోట్లు సమకూర్చాలని నిర్ణయించింది. బడ్జెటేతర నిధులను బ్యాంక్ గ్యారెంటీగా లేదా ఇతర రూపంలో సర్దుబాటు చేయనున్నారు. నష్టాల్లో కూరుకుపోయి ప్రతినెలా జీతాలకే కష్టంగా ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడంతోపాటు.. సంస్థలో పనిచేస్తున్న దాదాపు 48 వేల మంది ఉద్యోగుల కుటుంబాల్లో ఈ బడ్జెట్ సంతోషాన్ని, భరోసాను నింపింది. సర్కార్ చొరవతో ఇటీవల ఏర్పాటుచేసిన కార్గో, పార్శిల్ సర్వీస్లు సైతం ఆర్టీసికి అదనపు ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి.