లండన్ : నిత్యం ఒక కప్పు పరిమాణంలో ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. డెన్మార్క్ లో నివసించే 50,000 మంది ఆహారపు అలవాట్లను 23 ఏండ్లపాటు పరిశీలించిన అనంతరం ఎడిత్ కొవాన్ యూనివర్సిటీ పరిశోధన ఈ వివరాలను నిగ్గుతేల్చింది.
నైట్రేట్ పుష్కలంగా లభించే ఆకు కూరలు, కాయగూరలు ఆహారంలో తరచూ తీసుకునేవారిలో సిస్టాలిక్ రక్తపోటు 2.5 ఎంఎంహెచ్ జీ తక్కువగా ఉంటుందని, వారికి గుండె జబ్బుల ముప్పు ఇతరులతో పోలిస్తే 12 నుంచి 26 శాతం తక్కువగా ఉంటుందని ఆ అథ్యయనంలో తేలింది. నైట్రేట్ ఉండే కూరగాయలు, ఆకుకూరలు నేరుగా ఒక కప్పు తీసుకునేవారితో పాటు వండిన కూరగాయలు అర కప్పు తీసుకునేవారిలో గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తక్కువగా ఉందని తమ పరిశోధనలో వెల్లడైందని అథ్యయన రచయిత, ఈసీయూ ఇనిస్టిట్యూట్ ఫర్ న్యూట్రిషన్ కు చెందిన డాక్టర్ కేథరీన్ బాండనో తెలిపారు.