మెహిదీపట్నం : పాతకక్ష్యల నేపథ్యంలో ఓ వ్యక్తిని దారి కాచి దారుణంగా హత్య చేసిన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…..టోలిచౌకి నదీం కాలనీ ప్రాంతంలో నివసించే సయ్యద్ జిలానీ (50) హకీంపేట్ ప్రాంతంలో ఓ కిరాణా జనరల్ స్టోర్లో పనిచేస్తున్నాడు. గతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సల్మాన్ అనే యువకుడి హత్యకేసులో రెండో నిందితుడిగా ఉన్నాడు.
సల్మాన్ సోదరుడు షేక్ ఇమ్రాన్ జిలానీ జైలు నుంచి వచ్చిన తర్వాత అతడిని హత్య చేయడానికి ప్లాన్ వేశాడు. గత కొన్ని రోజులుగా జిలానీ రాకపోకలపై ఇమ్రాన్ నిఘా పెట్టాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సయ్యద్ జిలానీ దుకాణంలో పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నాడు. టోలిచౌకి నుంచి సెవన్ టూంబ్స్ వెళ్లే రోడ్డులో మహబూబ్ ఫంక్షన్ హాల్ వద్ద జిలానీని షేక్ ఇమ్రాన్ తన స్నేహితులు మహ్మద్ రెహాన్, ముఖ్తార్ అహ్మద్లతో కలిసి అడ్డుకుని గొంతు కోసి హత్య చేసి పారిపోయారు.
సమాచారం అందుకున్న గోల్కొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించారు. ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు .కేసు దర్యాప్తులో ఉంది. ఇదిలా ఉండగా హత్యకు పాల్పడ్డ నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.