హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయుల్లో ఆత్మవిశ్వాసం నింపడం, బలహీనతలను అధిగమించేందుకు నిర్వహిస్తున్న ఉపాధ్యాయ స్వీయ మదింపుపై టీచర్లు అనాసక్తి చూపుతున్నారు. తమకు తాముగా మదింపు చేసుకునేందుకు చొరవచూపడం లేదు. ఫలితంగా ఈ ప్రక్రియ నిర్లక్ష్యపు తంతును తలపిస్తున్నది. కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు టీచర్ సెల్ఫ్ అసెస్మెంట్ రుబ్రిక్స్ (టీఎస్ఏఆర్) పేరుతో ఉపాధ్యాయ స్వీయ మదింపును నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొబైల్ యాప్ను అభివృద్ధిచేయగా, వీరికి 47 ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రాన్ని పంపించారు. తమ పనితీరుకు తామే రేటింగ్స్ ఇచ్చుకునే వెసులుబాటు కల్పించారు. ఇప్పటివరకు 37.86 శాతం ఉపాధ్యాయులే స్వీయ మదింపును పూర్తిచేశారు. 33 జిల్లాలకుగాను 7 జిల్లాల్లో మాత్రమే 50 శాతానికిపైగా ఉపాధ్యాయులు స్వీయ మదింపు చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 3,560 మంది టీచర్లకుగాను అత్యల్పంగా కేవలం 97 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారిలో 27 (0.76శాతం) మంది మాత్రమే స్వీయ మదింపు చేసుకున్నారు.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 6,597 మంది టీచర్లకుగాను 1,487 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 664 మందే (10. 07) తమ పనితీరును అంచనావేసుకున్నారు.
వరంగల్ రూరల్ జిల్లాలో 3,399 ఉపాధ్యాయులకుగాను 982 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, 425 (12.5శాతం) మంది తమ వివరాలను నమోదుచేసుకున్నారు.