లక్నో : వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద పోలీసులు అడ్డుకుని వేధించడంతో మనస్ధాపానికి లోనైన యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన యూపీలోని భాగ్పట్ జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు, యువకుడి మధ్య జరిగిన వాగ్వాదంతో యువకుడు తీవ్ర నిర్ణయం తీసుకోవడంతో కలకలం రేగింది. యువకుడి మరణంతో పది మంది పోలీసులపై ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాలు నమోదు చేశారు. భాగ్పట్ జిల్లాలోని తన గ్రామం సమీపంలోని చెట్టుకు యువకుడి మృతదేహం వేలాడుతుండటం స్ధానికులు గుర్తించారు. వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద పోలీసులు అకారణంగా వేధించినందునే ఈ దారుణం జరిగిందని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ ఘటనకు సంబంధించి యువకుడిని పట్టుకునేందుకు ఇద్దరు పోలీసులు ప్రయత్నిస్తున్న వీడియో వైరల్గా మారింది. యువకుడిని పోలీసులు నెట్టివేసిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి. టీకా కేంద్రం వద్ద తన కుమారుడి పేరును సిబ్బంది పిలిచినా లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో వాగ్వాదం జరిగిందని బాధితుడి తండ్రి చెప్పారు. తన కుమారుడిని నెట్టివేసిన పోలీసులను ప్రశ్నించడంతో వారు అతడిపై చేయి చేసుకున్నారని వివరించారు. తన కుమారుడిని ఓ గదిలోకి లాక్కెళ్లి అక్కడ లాఠీలతో కొట్టారని ఆరోపించారు. కొడుకును అక్కడి నుంచి తాము ఇంటికి తీసుకువెళ్లగా గ్రామానికి వచ్చిన పోలీసులు తన భార్యను సైతం వేధించారని, దీంతో భయాందోళనకు గురై ఇంటి నుంచి పరుగుతీసి ఆపై శవమై తేలాడని కన్నీటిపర్యంతమయ్యాడు.