బంజారాహిల్స్ : అరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఉచితంగా చికిత్స పొందిన రోగులవద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో ఓ నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీలు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా పెద్దావూర మండలం పైలాన్ కాలనీకి చెందిన కర్నె హనుమంతు, దాసరి ఉమామహేశ్వర్రావు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆరోగ్య శ్రీ కింద చికిత్స కోసం నగరానికి వచ్చారు.
తమ ఊర్లో రేషన్ షాపు నడిపిస్తున్న పెద్ద సైదులు, అతడి సోదరుడు చిన్న సైదులు కలిసి తమకు తెలిసిన వారితో చెప్పి ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్స చేయిస్తామని నమ్మించారు. చికిత్స పూర్తయిన తర్వాత వారిద్దరినీ వేధించి రూ.55వేలు వసూలు చేశారు. ఈ మేరకు బాధితులు జిల్లా ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్కడి అధికారులు ఈ విషయాన్ని జూబ్లీహిల్స్లోని ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ ఉన్నతాధికారులకు తెలియజేశారు.
దీంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ అధికారి బీ.వెంకటేశ్వర్రావు ఈ నెల 22న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో నిందితుల్లో ఒకరైన చిన్న సైదులును సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.