హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ. 1,432 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాల్లో కూలీలకు ఉపాధి నిమిత్తం నిధులను మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13కోట్ల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇప్పటికే 9 కోట్ల పనిదినాలను కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. గత సీజన్లో ఈ సమయంలో 17 లక్షల 50 వేల కూలీలు పని చేస్తే, ఈ సీజన్లో 35 లక్షల 50 వేల మంది ఉపాధి కూలీలు పని చేస్తున్నారని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో 32 జిల్లాల్లోని 540 మండలాల్లో కరోనా నిబంధనలతో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. కరోనా నిబంధనల మేరకు కూలీలు కూడా మాస్కులు ధరించి పనులకు హాజరుకావాలని, చేతులను తరచుగా శానిటేషన్ చేసుకుని పనులు చేసేటప్పుడు, ఇంటికి వెళ్లేటప్పుడు సామాజిక దూరం పాటించాలని మంత్రి కోరారు.